27, డిసెంబర్ 2012, గురువారం

పేదవారు

పేదవారు, పీడితులు, సంఘంచే అంటరాని వారు అనబడేవారు, అనాధలు, వారి వారి గుండెల్లొ వేదనలను కవితలుగా వ్రాస్తే, మొదట రాయడానికి పదాలు దొరకవు, రాసినా చదివేందుకు ధైర్యం చాలదు. వారి ఆక్రందనలు, ఆక్రోశాలు, ప్రస్పుటంగా ఊహలకందని భాషల్లొ, పదాలతో కవితంతా నిండి ఉంటాయి. ఆ కవిత చదివి అర్ధం చేసుకొని భరించగలిగే శక్తి ఉంటే వారిని ఇలా ఈ సంఘం పీడించదు. ఆ కవిత రగిల్చే మంటల్లో మసై పోతారు. వారిలో ఇంత ఆక్రందన దాగుందా అని ఆశ్చర్యంలో మునిగి తేలుతారు. వారూ మానవులే అని మరచి ఇన్నాళ్ళూ కళ్ళు మూసుక పోయిన కుటిల నాయకులంతా కంగారు పడతారు. వారి పట్ల సమాజం ప్రవర్తిస్తున్న తీరు, వారిలో ఆగ్రహాల జ్వాలలను రగిలించినా, వారి ఆకలి కేకలు సమాజం చెవిని చేరుకున్న, వారి చావులు సమాజం హృదయాన్ని కరిగించకున్నా, గుండెలోతుల్లో రక్తం మరుగుతున్నా, ఏమీ చేయలేని నిస్సాహాయత, ఎదిరించే బలం లేదు. ఎదిరించినా అణగార్చ బడ్డవారు. వారి ఆవేదన ఏ స్థాయిలో ఉంటుందో చెప్పలేం. ఊహించలేం కదూ. అందుకే వారి ఆవేశాలు, ఆక్రోశాలు కవితగా రాస్తే ఆ పదజాలం నిప్పులు కక్కుతుంది. ఆ కవితలు మంటలు రేపుతాయి. పేలిన అగ్ని పర్వతంలాగా లావా చిందిస్తూ వారి హృదయాంతరాళాల నుండి ఒక్కసారిగా పెల్లుబికిన కవితాగ్ని కణాలకు ఎదురు నిలువ లేక సమాజం భీతిల్లవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి