29, ఆగస్టు 2019, గురువారం

నా అంతరంగం లో విశ్వనాథ వారి వేయిపడగలు


ఈ మధ్యే విశ్వనాథ వారి వేయి పడగలు చదివే అదృష్టం కలిగింది. ఓ అద్భుత మైన కావ్యాన్ని చదివిన అనుభూతి నా హృదయం నిండా కలిగింది. అనిర్వచనీయమైన అనుభూతులు ఇంకెన్నో. వానిలో కొన్నైనా అందరితో పంచుకుందామని ఈ వ్యాసం రాస్తున్నాను. వేయి పడగలు చదవని వారికి దీనిని పరిచయం చెయ్యడానికి చేసే ఓ చిన్న ప్రయత్నం. కథ వివరించే ప్రయత్నం చేయను. విశ్వనాథ వారు స్పృశించిన అంశాలు, రచనా శైలి మరియు దీనిపై నా భావనలు చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను.
ఒక్కసారి చదవగానే కొరుకుడు పడని అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు ఈ కావ్యం లో చాలా సందర్భాలలో మనకు తారసపడుతుంది. ఐనా చదువుతూ పోతూ ఉంటే లయ తప్పక కథతో మనం ప్రయాణం సాగుతూనే ఉంటుంది. విశ్వనాధ వారి కొన్ని ఆలోచనలు మనకిప్పుడు ఛాందస మనిపించినా, వాటిని నేను ఎక్కువగా ఈ వ్యాసం లో స్పృశించను. ఐనా ఈ నవలా కావ్యం చదివాకా అవేవి మనకు జ్ఞప్తికి రావు. అవన్నీ ఈయన కవితా రస ప్రవాహములో కొట్టుకొని పోతాయి .
విశ్వనాథ వారి రచనా శైలిని తెలియజేయుట కోసం ఈ వ్యాసం లో అక్కడక్కడా నవలలోని కొన్ని వాక్యాలని యధాతధంగా రాయడం జరిగింది.
ఇందులో వివరించని విషయం లేదు. వర్ణించని ఋతువు లేదు. స్పృశించని కాలము లేదు. నాటకము, నాట్యము, సాహిత్యము, సంగీతమూ ఏదీ వదలలేదు. ఒక్కొక్క విషయాన్నీ ఒక్కొక్క సందర్భములో ఒక్కొక్క రకముగా విపులంగా వివరిస్తూ ఎప్పటికప్పుడు నూతనంగా ఆవిష్కరిస్తూ హృదయానందాన్ని కలిగిస్తూ విస్త్రుతమైన ఆ జ్ఞాన సంపదను మన తెలుగు వారికి అందించిన అపురూప కావ్యం.

భారతీయతకిది ఒక నిదర్శనం !
భారతీయ సంగీత, సాహిత్య, నాట్యాలకు ఇది నీరాజనం !
కనుమరుగైన ప్రాచీన సంస్క్రుతీ సాంప్రదాయాలను గుర్తు చేసిన అద్భుత గ్రంధం !
జీవిత గమనం లో దాంపత్యపు విలువల్ని ఉన్నత స్థాయిలో వివరించిన సుందర కావ్యం !
దేశంలో అన్ని వ్యవస్థలలో పాశ్చాత్య పోకడల ప్రభావాన్ని కళ్ళకు కట్టి చూపిన అరుదైన పుస్తకం !

అన్య మతాల దాడులకు ఎదురొడ్డి నిలబడిన మన హిందూ ధర్మం గొప్పతనాన్ని చాటిన మహా కావ్యం!
తెలుగు జాతి సంస్కృతీ సాంప్రదాయాలకు దర్పణం!
పర్యావరణ కాలుష్యం గురించి ఆనాడే హెచ్చరించిన విజ్ఞాన ఖని!
పురాతన విద్య విధానం గురించి, కొత్త పోకడలతో విలువలు తగ్గుతున్న విద్యా ప్రమాణాల గూర్చి ఆనాడే ప్రస్తావించిన దూర దర్శిని!
నవీకరణకు తల్లడిల్లిన దేశపు పట్టుకొమ్మలైన పల్లెటూర్ల పరిస్థితిని కళ్ళకు కట్టిన శిల్పం !

యువ కవులకు ఇది చుక్కాణి
నవ కవితకు ఇది పునాది
తెలుగు భాషకిది అలంకార భూషణం
భావితరాలకిది మార్గదర్శి

ఇందులో...
జాతీయ భావం వుంది
విప్లవ గీతీ వుంది
సామాజిక స్పృహ వుంది
భక్తి భావమూ వుంది
ముక్తి మార్గమూ వుంది

తెలుగు చదవడమే కష్టమవుతున్న రోజుల్లో, మన భాష మాధుర్యాన్ని గొప్పతనాన్ని పలు విధాలుగా చాటి చెప్పిన ఒక గొప్ప కావ్యం. ఆనాటి పరిస్థితులు ఈనాటికీ మార్పులేకుండా, అవే స్థితులు భవిష్యత్తు లోనూ అలానే ఉంటాయనిపిస్తుంది. ముఖ్యముగా విద్యా ప్రమాణాలు, సంగీత సాహిత్య విషయాలలో. పడిపోతున్న విద్యా ప్రమాణాల మీద, విశ్వ విద్యాలయాల తీరు మీద ఒకింత అసహనాన్ని వ్యక్తం చేసారు. బోధన ఎలా ఉంటే బాగుంటుందన్న విషయాల్ని వివరించారు. విలువలు పతన మవుతున్న నాటక మరియు సినీ రంగాలను తన పదునైన ఆలోచనలతో, వ్యాక్యలతో దుయ్యబట్టారు. నటుని లక్షణములు, ఆహార్యము, ఆంగీకము, పద్యము పాడు తీరు అన్నింటిని చక్కగా వివరించారు విశ్వనాథ వారు. అందుకే 1934 పరిస్థితులు తెలుసుకున్నట్లు లేదు. వర్తమానాన్ని ఆనాడే భవిష్యత్తు తెలుపుతూ రాసిన జ్యోతిష్య రత్నాకరమని పిస్తుంది. వరి బియ్యం, కొళాయి నీళ్లు తెస్తున్న రోగాలు ఆనాడే ఈ కావ్యములో రాయబడ్డాయి. పచ్చటి పొలాల్ని కబళిస్తూ, విస్తరిస్తూ పోయిన గ్రామాల గూర్చి, చెట్లను నరుక్కుంటూ విస్తరించిన పట్టణాల గూర్చి, మెట్ట పొలాలే లేకుండా చేస్తూ వచ్చిన మాగాణుల గూర్చి వాటి అనర్ధాల గూర్చి, ఎంతో గొప్పగా వర్ణించ బడ్డాయి. భారతీయ గోసంపదగూర్చి, వాటిని కబేళాలలకు తరలిస్తున్న తీరు గూర్చి ఏంతో నిశితంగా వివరిచించారు విశ్వనాథ వారు. దిగజారుతున్న పత్రికా విలువల గూర్చి... ఒకటేమిటి ....

లేని విషయం లేదు....
శిల్పం , సంగీతం, సాహిత్యం, నాట్యం
సంప్రదాయం, స్నేహం
దాంపత్యమాధుర్యం
విద్య, వివాహం
భాష, నాటకం, సినిమా!!!

వర్ణించని ..
ఋతువు లేదు
వెన్నెల లేదు
చీకటి లేదు
పచ్చని పైరు లేదు
కాలము లేదు !!!

వెన్నెల గురించి కొన్ని చోట్ల వర్ణిస్తూ....

ఆనాడు పూర్ణిమ, వెన్నెలలు, పాలిపోయిన రోగి దేహచ్ఛాయ వలె తెల్లనై, ఉష్ణ రోగి శరీరం వలె వేసంగి కాకులకు వెచ్చనై, తెల తెల బోయెను.
వైశాఖ పూర్ణిమ నాడు వెన్నెలలు విరియ కాసెను. తీక్ష సూర్యుని పేరి సుదర్శనాయుధము వేయి అంచులతో పరిభ్రమించగా, దాని నుండి వినిర్గతములైన కాంతులు చంద్రబింబం మిష చేత నాల్గు దేసెలా నావరించినట్లు, భక్తుల యెడల ప్రసన్నుడై శ్రీ వేణు గోపాల స్వామి మందహాస ధీధితులు గాలి పొరలపై నుయ్యాలలూగినట్లు వెన్నెలలు వీచెను .
వెన్నెలలు నిర్మధిత క్షీర సాగర తరంగముల వలే, ప్రాదుర్భూతామృత ఖుంభ నిర్వ మదమృత డిండీర కాంతిచ్ఛటా స్ఫుర త్స్ఫోరకం వలే, మందనరాజ్ఞు కృత వాసుకీ ముఖ నిస్ఠ్యూత ఫేన జాలము వలే, మధ్యమాన మందర గిర్యుభయ పార్శ్వ సంస్థిత దేవ దానవ మహటాట్ట హాస ధీధితివలె, పరిజ్వలిత క్షీర పాధోధి వినిర్గమ చ్చంద్ర బింబ సుధా రోచి: పూర ధగద్థగిత దశ దిశా సంతాన మేదురిత ప్రసన్న కాంతులవలె కామధేను కల్పవృక్ష చింతామణీ ప్రముఖ నానా దివ్య సృష్టి పరికల్పిత స్వర్గ వికాసమువలే, అన్యోన్య జల్పిత తృణీకార వ్వాక్యావాన సూచి మందహాస పరిహాస ప్రస్పురద్ధంత కాంతిచ్చటాభిరామాప్సరోనివాహా పరీధాన చేలాంచలములవలె వెల్లి విరిసెను. “


సూర్యోదయం గురించి ...

తెల్లవారెను. తెలవారుచున్నదనగా వృక్షాగ్రాముల నుండి లోకము కన్నా ముందుగా ప్రత్యూష రధము కదలికలు చూచిన ద్విజ కులము కూసెను. పైడి కంటులు టప టప మని రెక్కలు కొట్టి, కిచ కిచ మని కూసి జంటలై కదలి సౌఖశాయనీకులయ్యెను. తూర్పు కొండ నునుపైన చరియల మీద, కాలిగిట్టలు జారి సూర్య హయములు పరువెత్త లేనిచో, అనూరుడు కొరడా చివళ్ళు మ్రోగించి యదిలించి త్రోలెను గాబోలు. వాని మట్టేల కట్టిన నూర్వుల ట్లుష: కాంతి యుండలుండలుగా తూర్పు సీమ ఛిన్దిపోయెను.”

భారతీయ శిల్పం మరియు పాశ్చాత్య శిల్పం గల భేదాలను వివరిస్తూ ..

పాశ్చాత్య శిల్పమునకు మాతృక లుండును. భారతీయ శిల్పం అట్లు కాదు. నేత్రము తామర పువ్వు వలె నున్నదని నియమము చేసుకొని యొక దేవతా మూర్తి ని చిత్రించినచొ ఆమె నేత్రమును తామర పువ్వు వలె చిత్రించును. అట్లే తక్కినదంతయును. ఇట్లు చిత్రించుట భారతదేశ శిల్పి చక్షుర్విషయమున కన్నా ఎక్కువ మనో విషయమగుచున్నది.
పాశ్చాత్య శిల్పమందు మనము చూచు గొప్ప సౌందర్యమును కలిగియుండును. అది మన నేత్రా నందకరము. మననుభవించు ఆనందము నేత్రగత మనోవిషయము. భారతీయ శిల్పమునందలి చిత్రము పూర్తిగా మనో విషయము దానిని గ్రహించుట యందు నేత్రము సాధనము మాత్రమే . ఈ రెండు శిల్పముల యందు ఇది యొక విశిష్ట విషయము . తక్కిన భేదములు చాలా కలవు.”
ఈ విధంబుగా ఎంతో మధురముగా వివరిస్తూ, మన భారతీయ సాంప్రదాయ మరియు కళల గొప్పదనాన్ని శ్లాఘిస్తూ మనకు చెప్పే గొప్ప ప్రయత్నం చేసారు. నాట్య శాస్త్రము గొప్పతనము గురించి, ప్రదర్శించు తీరు గురించి, ప్రదర్శించు వారి నిభద్దత మరియు అంకిత భావం గురించి, కళలన్నీ మనిషి మానసిక వికాశమునకేనని, నడక నడత నేర్పే సాధనాలని, పురాణాలు ఇతిహాసాలు జ్ఞాన సమపార్జన కనీ ఎంతో గొప్పగా చాటి చెప్పారు .
29 వ అధ్యాయం ఒక అద్భుతం. నాట్య శాస్త్రాన్ని అవపోసిన పట్టిన వానిలా ముద్రలను వర్ణిస్తూ దశావతార ఘట్టాల్ని మన కళ్ళ ముందు జరుగుతున్నట్లు వర్ణించిన తీరు అపురూపం. మత్య, కూర్మ, రామ, కృష్ణావతారలను వర్ణించిన తీరు మన ముందే వెన్నెలలు విరిసినట్లు, శ్రీ వేణు గోపాల స్వామి సాక్షాత్కారమై నట్లు అనుభూతిని మిగిలిస్తుంది. ఈ అధ్యాయం ఈ వేయి పడగల కావ్య అపురూపత్వానికి పరాకాష్ట. అనిర్వచనీయమైన భావాలెన్నో మనసున కలిగిస్తుంది.

స్ప్రుశించని అంశము లేదు ..

విద్య ఐననేమి
అధికార మైననేమి
ఎన్నికలయిన నేమి
శృంగారమైన నేమి
కామమైన నేమి
కవిత్వమైన నేమి
పండగలైన నేమి
వృత్తు లైన నేమి
వర్ణాలైన నేమి
మతమైనా నేమి
ప్రేమనైన నేమి
తర్కమైన నేమి
అక్రమ సంబంధాలైన నేమి!!!

విద్య గురించి చెబుతు ..

విద్య ప్రధానముగా రెండు విధములు. ఒకటి వృత్తి విద్య. రెండవది జ్ఞానము కొరకు. చదువు విద్య. ఇవి రెండును కలుపు రాదు. ఇప్పటి పాఠశాలలో ఉన్న దోషం వానిని రెంటిని కలుపుటయే. వృత్తి విద్య జీవనాధారమైనది. జ్ఞానము కొరకైన విద్య మనిషి హృదయమునకు సంస్కారం తెచ్చుటకు ఏర్పడినది.
విద్యకు పరమ ప్రయోజనమైనది విస్పష్టమై స్వచ్ఛమైన భావోదయమును కలుగ జేయుట. చదువునకు ప్రధానమైనది స్వచ్ఛమైన భావమునెరుంగుట. అట్టి భావము ఇంద్రియముల యొక్క చక్కని శిక్ష చేత గానీ యుత్పన్నము కాదు.”

సీత రాముల ప్రేమను గూర్చి వివరిస్తూ ... 
 
ప్రభువు శివధనుర్బంగము చేసిన వేళనే సీతారాముల యాత్మ లైక్యము నొందినవి. తరువాత వారికి వియోగము లేదు, విప్రలంభము లేదు, సాత్వికాది భావోదయములు లేవు. రసమచ్చట నీయమాన స్వాదుత్వము కాదు. అది అనుభావ విభవాదుల చేత కలిగినది కాదు. వారి ఇద్దరి ప్రేమ యందు రస స్వరూపము నిత్యమై, అవికారమై కూటస్థమై యున్నది. తరువాత వచ్చిన వియోగము వలన వారి ప్రేమ భావమేమియూ చెడలేదు. వారి రసాత్మత కొంచెపడలేదు. నిత్యమైన నిర్మలమైన సీతారాముల ప్రేమ తత్వమది. అది తరంగములు లేని కడలి. జల బిందువు లెర్పరించరాని మహాంభ స్వరూపము. అణువణువులుగా చీలిపోని మహాభూతా ప్రకృతి.”

భారత పాశ్చాత్య కవిత్వములోని భేధాలని ఉన్మాద రసము ఉదాహరణగా తీసికొని వివరిస్తూ ..
విక్రమోర్వశీయమైన పురూరవశ్చక్రవర్తి కున్మాద విజృంభణము జరిగినది. లియరునకు కలిగిన యున్మాదముతో, హామ్లెట్ కు గలిగిన యున్మాదముతో పురూరవుని యున్మాదము పోల్చి చూసిన తెలియగలదు. ఉన్మాదములకు కలిగిన హేతువుల భిన్నత్వం వలన ఆ యున్మాదము లను భిన్నముగా ఉన్నవనచ్చును .
పాశ్చాత్యుల శిల్పము సహారా ఎడారి లోని సికతామయోన్మత్త ప్రళయ వాయువుల వలె విరుచుకొని, మానుష ప్రకృతి నున్మూలించుటకు ప్రయత్నించును.
భారతీయ శిల్పము భారత జాతి మత ధర్మమ వలెనే ఇంద్రియముల నదుపులో పెట్టి సంఘ మర్యాదల ననుసరించి నడువవలె నన్నట్లు - భావోద్రేకములను నియమించి తదంతర్గాడత్వమును ప్రకటించును, బహిఋన్మత్త విస్తృతి ని నియమించి చూపును. “

ఈ కావ్య మంతయూ భారతీయతే గోచరిస్తుంది. సాహిత్యం, సంగీతము మన జీవితములో భాగమేనని చెప్పే ప్రయత్నము చేస్తుంది. తెలుగు భాష గొప్పదనాన్ని, మాతృ భాష ఉపయోగాన్ని తెలియ చేస్తుంది. సంఘము, మతము, రాజకీయ విషయములు మొదలైన మానవ జీవితము యొక్క లోతును తెలియజేయు మనో భావములు చెప్పునది నిజమైన భాష అంటారు విశ్వనాథ వారు.
అప్పుడే విస్తరిస్తున్న పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాల మీద విశ్వనాథ వారు చేసిన దాడనే చెప్పవచ్చు. ఇంగ్లీష్ భాష ప్రభావము సమాజముపై ఎలా వుందన్నది, ఎంతో గొప్పగా వర్ణించారు. మన భాష గొప్పదనాన్ని కొన్ని ఉదాహారణలతో నిరూపించారు. ముందు మాతృభాష ఎందుకు నేర్వాలి, మాతృభాష వచ్చిన పిదప ఏ ఇతర భాషలైన ఎంత శులభముగా నేర్వవచ్చన్నది వివరించారు.
పాశ్చాత్య సాహిత్యపు మోజులో భారతీయ సాహిత్యం ఎదుర్కున్న సవాళ్ళను వివరించారు. మన సాహిత్య గొప్పదనాన్ని కొన్ని ఉదాహరణల ద్వారా చాటి చెప్పారు.
తానూ చెప్పదలచుకున్న విషయాన్ని కొన్ని పాత్రల ద్వారా చెప్పిస్తూ అప్పటి సంఘ పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు విశ్వనాథ వారు. పైన చెప్పినట్లు స్పృశించని అంశం లేదు. అన్ని విషయాలను రెండు లేదా మూడు పాత్రల మధ్య చర్చకు తెచ్చి వాద ప్రతి వాదములకు తావు ఇచ్చి, వానిలో ఒక పాత్ర ద్వారా భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు.
ఈ వాద ప్రతి వాదాలలో భాగంగానే ఒక చోట లోకములో లౌక్యం యొక్క విలువను, ముక్కుసూటి తనము వల్ల వచ్చు నష్టమును క్రింది విధముగా తెలియ చెప్పారు.
నిజముగా వట్టి యకల్మష ప్రకృతులకు లోకములో తావులేదు. వారు కష్ట పడవలసినదే. అధికారమున్నచోట ఇట్టి యదార్ధ ప్రవర్తన యుండేనా, రేపటితో జగత్తు జగత్తు కాదు. క్రుతిమములైన పద్ధతులున్న కదా వ్యవహారం సాగుట. కృతిమము లేనిచో వ్యవహారమెందుకు?
ఘాడ శీలత్వము పనికిరాదు. అబద్ధమును దౌర్మార్గమును కొంత యోర్చుకొనుట నేర్చుకోవలయును. ”
లోకములో బ్రతుకవలయున్నచో నీ యుద్వేగము, నీ మనస్సు, నీ అంతరాత్మ అది యొక్క సంస్థ. ఆ ఉద్యోగమూ, అందరితో నీవు మెలుగు రీతి, ఎట్టివారితోనైననూ నవ్వుచూ మాట్లాడుట ఇది యొక సంస్థ. ఆ రెండు రెండుగా బ్రతుకవలయును. రెండునూ కలిసియున్న వారి జీవితమూ సుఖమే. నిష్కలుష అంతరాత్మయు, స్వతంత్ర జీవనము కలవారు యోగులు. వారికీ కష్టము లేదు. ”

వాగ్వివాదం గురించి చెబుతూ 
 
లోకమున విరోధమనగా భిన్నాభిప్రాయమే. అవిద్యావంతులు మరియు అవివేకులు వారే నయము. వెంటనే తేలిపోవును. వీరు నాగరికులమని, విద్యావంతులమని పేరుపెట్టుకొని, క్రోధములు చక్కగా పెంచుకొని ఒకరి జీవనోపాయములొకరు, ఒకరి యషః పదము లొకరు నిర్మూలించుటకు ప్రయత్నించుచుందురు. ”

ఈ కావ్యం..
బహుముఖం
సుమధురం
ఓ అద్భుతం!

ఈ వ్యాసం ముగించే ముందు నా అంతరంగం లో వేయిపడగలు కావ్యం ఈ క్రింది విధముగా !

ఓ విశ్వనాథా!
నీ వేయిపడగలు కావ్యం చదివినంత సేపు

సూర్య చంద్రుల కాంతులు మనంబున విరిసినట్లు
శీతా కాలమున మంచు బిందువులు తనువును తాకినట్లు
హిమవత్పర్వతము కరిగి మహోగ్రమై పరవళ్లు తొక్కుతూ నా పాదాలు స్పృశించినట్టు
అనుభూతి!

మీ కావ్యం

గ్రీష్మ తాపాల్లో ఉక్క పుట్టించింది
శరద్వెన్నెలలో ఓలా లాడించింది
పచ్చటి పంటల్లో హరిత వర్ణాన్ని కనులకు చూపించింది
భారతీయ నృత్య ముద్రికల్ని నా చక్షువులలో నిలబెట్టింది
భారతీయ చిత్రానికి, సాహిత్యానికి నా హృదయ అంతరాలో అత్యున్నస్థాయి నిచ్చింది !

మీ కావ్యం

మతం మన జీవన గమనమని
మాతృభాష మన హృదయ స్పందనని
సంగీత సాహిత్యాలు మన జీవిత అంతర్భాగమని
దైవం, దేవాలయం, ప్రకృతి మన జీవిత పరమార్థాలని
దాంపత్య జీవితం భావితరాల మనుగడని
వివరించింది!

మీ కావ్యం

ప్రతి తెలుగు వాడు చదువవలసిన
భావి తరాలు తెలుసుకోవలసిన

అపురూప కావ్యం !
అరుదైన కావ్యం !!
అందమైన కావ్యం !!!