10, ఏప్రిల్ 2010, శనివారం

కవులు కళాకారులు

"కవులు కళాకారులు మానవాళికి సంసృతిని నేర్పారు - లేకుంటే మనుష్యులు ఒకరిని ఒకరు వేటాడుకొని జంతువులకన్నా హీనంగా ప్రవర్తిస్తుండే వారే" అని గుంటూరి శేషేంద్ర శర్మ గారు చేప్పారు. అవును నిజమే కదా.
ఆవేశం, పరనింద, అత్యాశ, లోభితనం, కామం, అసత్యం, ఇలా ఎన్నో దుర్లక్షణాలు మన సమాజంలో చూస్తూ ఉన్నాము. మనలో కూడా వీటిల్లో కొన్ని లక్షణాలు వున్నాయి. మన కవులు, కళాకారులు మనకు ఎన్నో రకాలుగా వీటివల్ల నష్టాలను చెబుతూ వచ్చారు. పురాణాలలో సత్యాన్ని గమనిస్తే భొధపడేది ఈ విషయాలే. వాటిల్లో ఈ కవులు కొన్ని పాత్రలను సృష్టించి, ఆయా పాత్రలకు వివిధ రకములయిన లక్షణములను జోడించి, వాటికి అణుగుణముగా కధను లేదా కవితను నడిపి చివరికి ఆ లక్షణ ప్రభావం ఆ పాత్రను ఏ స్తాయికి తీసుకవెడుతుందో కళ్ళముందు చూపినట్లుగా రాశారు. వాటిని కళాకారులు ప్రదర్శించి ఆయా పాత్రల లక్షణాలను, వాటివల్ల సంభవించే పరిణామాలను జనం ముందుకు తెచ్చారు. ఆయా పాత్రలు, వాటి లక్షణాలను ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచి పోయేలా చేశారు. సాధువులు, మునులు ధర్మ ప్రచారం చేస్తూ వీటిని ప్రచారం సాగించారు. అందువల్లే ఓ కామాంధుడ్ని కీచకుడనో, లేక రావణుడనో అంటాం. అసూయలకు, పదవీ వ్యామోహములకు భారతంలో ధుర్యోధనుని పాత్రను, ధర్మానికి ధర్మరాజు, సత్యానికి హరిశ్చంద్రుడు, దానానికి కర్ణుడు, శిబి పాత్రలు తార్కాణాలుగా నిలుస్తాయి. మనిషి లోని ప్రతి లక్షణానికి మన పురణాలలో, కావ్యాలలో ఏదో ఒక పాత్ర మన ఊహలలో నిలుస్తుంది. గోరుముద్దలు పెడుతూ తల్లి పిల్లవాడికి ఏదో ఒక పాత్రను సృష్టించి కధ చెబుతుంటేకానీ ఆ పిల్లవాడు ముద్ద తినడు. మంచి చెబుతూ కూడా ఏదో ఒక పురాణంలో ఒక పాత్ర ఔచిత్యాన్ని వాడి అవగాహన కోసం ఉదహరిస్తుంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. కాబట్టి అవి ఎంతగా ప్రభావం చూపాయో చూసాముగా. ఈ కళలు సమాజానికి ఎంతో కొంత మేలు చేశాయని మరలా మరలా చెప్పనవసరం లేదు.