10, జూన్ 2013, సోమవారం

అరాచకాంధ్ర


 
నిన్న శ్రీశ్రీ "ఖడ్గసృష్టి" లోని కొన్ని కవితల్ని చదువుతుంటే కొన్ని ఆలోచనలు మనసులో
స్ఫురించాయి. 40/50 సంవత్సరములక్రితం రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందో ఆయన కవితల్లో
స్ఫష్టంగా కనబడింది. రాష్ట్రం ఏర్పడిన చాలా సంవత్సరాల వరకూ ఎక్కువ అభివృద్ధి లేని
పరిస్థితులు ఆ కవితల్లో కనపడ్డాయి. సరే అప్పటికి మనకు రాష్ట్రం వచ్చి కొన్నేళ్ళుగా
అనుకుంటే ఇప్పటి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. మళ్ళీ మనం వెనక్కి వెళుతున్నామా
అని ఉంది. ఈ పరిస్థితుల్ని ఆలోచిస్తుంటే ఓ కవిత నా మనసులో స్ఫురించింది.


మనకంటూ ఒక రాష్ట్రం కావాలని,
మనమంతా ఒకరిగా ఉండాలని,
భాషకి పట్టం కట్టాలని,
పోరాడి గెలిచాం!
రాష్ట్రాన్ని సాధించాం!!

అభివృద్ధి కలలు కన్నాం!
ప్రణాళికలు వేశాం!
బడ్జెట్లు ప్రవేశ పెట్టాం!!

కానీ ఏమి జరిగింది?

అరాచకం పెరిగింది!
అధోగతి పాలయింది!
దారి తప్పి పయనిస్తుంది!!

నాయకులు ఎందరో ఒచ్చారు
పాలకులు మారారు
మాటలెన్నో చెప్పారు!
చేతల్లో చూపలేకపోయారు!!

ఏదేదో చేస్తామన్నారు
ప్రాజెక్టులన్నారు
పేదరికం కనిపించదన్నారు
కులవాదం లేదన్నారు
మత మంటే అసలేందన్నారు
ప్రాంతాలు లేవన్నారు!
జాతి నెపం కూడదన్నారు
అవినేతికి దూరమన్నారు.
మరి ఏమయ్యింది!

ప్రాంతాలకోసం మారణ హోమం జరుగుతుంది
జన జీవనం స్తంభించింది
భయం రాజ్యమేలుతుంది
కులపిచ్చి కారుచిచ్చి అయ్యింది
మతం మహమ్మారిలా మారింది
పేదరికం పాతాళానికి చేరింది!
అవినీతి ఆకాశానికి ఎగసింది!!

అభివృద్ధిమాట దేవుడెరుగు!

కనీస సౌకర్యాలు కరువయ్యాయి
విద్యుత్తుకు కొరత, నీటికి కొరత
అధిక ధరలు,
భధ్రత లేదు, శాంతి లేదు!
చివరికి పరిపాలన లేదు!!

ప్రకృతి వనరులు దోచేడొకడు
భూమిని మింగి సొమ్ము చేసుకునేదొకడు
ప్రజల కడుపు కొట్టే వాడొకడు
శవరాజకీయం చేసేదొకడు
కోట్లు దోచి తాపీగా ఉండేదొకడు.

రాష్ట్రం ఏమయితేవాడికేం
ప్రజలు ఎటుబోతే వీళ్ళకేం
వీడి జేబులు నిండాయి!

కుర్చీకోసం ఏమయినా చేస్తారు
ప్రాంతాలను విభజిస్తారు
కులాల చిచ్చు రేపుతారు
మతాల మంట రగులుస్తారు
ధనప్రలోభాలు చేస్తారు

కానీ ప్రజలకేమయ్యింది?

ఇవన్నీ చూస్తున్నారు
ఊరకే మిన్నకున్నారు
ఆలోచన నశించిందా?
లేక ధైర్యం చాలడం లేదా?

నీ చేతిలోనే ఉంది కదా!

ఆయుధం! ఓటు!
ఏం దీన్ని సరిగ్గా వాడడం లేదేం?
కులవాదం నషాళానికంటిందా!
మతవాదం మనసంతా నిడిందా!
దోచిన సొమ్ము మనది కాదుగా అన్న భావనా!
మనదాకా రాలేదని అలసత్వమా!!

మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకునే అవకాశం
వదుల్కొని ప్రలోభాలకు లొంగి,
వివేకం మరచి ఎవరెక్కువ
దొచుకుంటున్నారో వారికి పట్టం కడుతున్నాం.

మారాలి!
మనమే మారాలి!

వీరిని రాష్ట్రం నుంచి పారదోలాలి.
ఆలోచించండి!
ఆవేశాలు వద్దు.
మన భవిష్యత్తు మనకు ముద్దు.

నిర్మిద్దాం హరితాంధ్రను, అభివృద్ధి పధంలో నడుపుదాం.
ఆటవిక సమాజం నుండి ఆధునిక సమాజానికి రాష్ట్రాన్ని నడిపిద్దాం.
ప్రపంచం ముందుకెడుతుంటే అభివృద్ధి నశించిన రాష్ట్రాన్ని మారుద్దాం.
ఈ దోపిడీదొంగల్ని, ఈ రాజకీయ రాబందుల్నుండి రాష్ట్రాన్ని రక్షిద్దాం!

ఆలోచించండి!!